Saturday 27 August 2011

ఆవిష్కారం

ఉపనిషత్తుల్ని ఆవిష్కరించిన ఋషులు అసాధారణ ప్రతిభామూర్తులు. వాళ్ళ అభివ్యక్తి అపూర్వమైంది. యితరులకన్నా విభిన్నమయింది. తాము దర్శించిన సత్యాల్ని సిద్ధాంతాల స్థాయికి వాళ్ళు దిగజార్చ లేదు. అట్లాంటి ప్రయత్నాలకు పనిగట్టుకుని పూనుకోలేదు. ఉపనిషత్తులు సిద్ధాంతాలు కావు. సత్యావిష్కరాలు. అవి చిన్ని చిన్ని మెరుపులు. అంతరాంతరాళాల ప్రకంపనలు. వాటికి ఒక క్రమబద్ధత, హేతుబద్ధత వుండదు. అవి అభిప్రాయాలు కావు. ఆలోచనలు కావు. వాళ్ళ దర్శనాల్లో వాళ్ళకేం కనిపించిందో, దాన్ని యథాతథంగా వాళ్ళు వ్యక్తీకరించారు. అవి సహజంగా పూలు విచ్చుకుంటున్నట్లు వుంటాయి.
కానీ సత్యాన్ని సిద్ధాంతీకరించడానికి ప్రయత్నించిన వాళ్ళు వున్నారు. దానివల్ల సత్యం దాని జీవాన్ని కోల్పోతుంది. హెగెల్, కాంట్, ప్లేటో, అరిస్టాటిల్ మొదలయిన తాత్వికుల దగ్గర కొన్ని జ్ఞానానికి సంబంధించిన అంశాలు వున్నాయి. వాటిల్లో సత్యానికి సంబంధించిన అంశవుంది. కానీ వాటిని వాళ్ళు సర్వనాశనం చేశారు. వాటిని సిద్ధాంతాల చట్రాల్లో బంధించడానికి ప్రయత్నించారు. సత్యమెప్పుతూ సిద్ధాంతాలకు లొంగదు. లొంగదీయాలని ప్రయత్నిస్తే అది నిర్జీవంగా మారుతుంది.
కోలరిడ్జ్ గొప్ప ఇంగ్లీషు కవి. వర్డ్స్‌వర్త్‌తో కలిసి కాల్పనిక కవిత్వ ఉద్యమ నిర్మాతల్లో ఒకడు. కోలరిడ్జ్ ఎన్నో సుప్రసద్ధి కవితలు రాశాడు. కానీ ఆయన మరణించే సమయనికి ఎన్నోవేల కవితల్ని అసంపూర్తిగా వదిలేశాడు. ఆయన మరణ సమయం ఆసన్నమయింది. ఆయన సన్నిహితుల్లో ఒకరు ‘‘మీరు ఎందుకని ఎన్నో కవితల్ని అసంపూర్తిగా వదిలిపెట్టారు? నిజానికి కొన్ని కవితలయితే కొన్ని లైన్లు రాస్తే చాలు పూర్తయి పోతాయి. దాంతో వాటికి సమగ్రత, సంపూర్ణత వస్తుంది. మీరు వాటిని పూర్తి చెయ్యవచ్చు కదా! ఎందుకు అలా వదిలేశారు. ఎంతమందితో వాటి గురించి అడిగారు. మీరు కొన్ని కవితల్ని పూర్తి చేస్తే అవి ఆంగ్ల సాహిత్యంలో ఆణిముత్యాలవుతాయి. వాటివల్ల మీ పేరు మరింత చిరస్థాయిగా మిగిలిపోతుంది కదా! మీరెందుకు ఆ ప్రయత్నం చెయ్యలేదు. ఎందుకు వాటిని అసంపూర్తిగా వదిలి పెట్టారు?’’ అన్నాడు.
దానికి కోలరిడ్జ్ ‘‘అట్లా చెయ్యడం నా చేత కాదు. పైగా వాటిని పూర్తి చెయ్యకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అప్పటిదాకా వచ్చిన ఆ కవిత్వ చరణాలు వాటంతట అవే వచ్చాయి. అవి ఎట్లా వచ్చాయో వాటిని అట్లాగే యథాతథంగా రాసిపెట్టాను. అందరూ అనుకోవచ్చు. వాటిని నేనే రాశానని. కానీ నిజానికి వాటిని నేను రాయలేదు. ఒక పరవశ క్షణంలో అవి వచ్చాయి. ఆవిష్కారమయ్యాయి. నేను నిమిత్తమాత్రుణ్ణి. అవి ఎంతవరకు ఏ మేరకు వస్తే వాటిని అంతమేరకు రాసి పెట్టాను. వాటిని పూర్తి చెయ్యగలిగే సాహసం చెయ్యను. అక్కడ నా సొంత తెలివితేటలు ప్రదర్శించే సాహసం చెయ్యను. అవి నా గుండా ప్రయాణించాయి. నేనొక మాధ్యమాన్ని మాత్రమే. వాటిలో నాకు ప్రమేయం లేదు. వాటి చివరి చరణాలు రాలేదు. వా కోసం ఎదురు చూస్తాను. వస్తే రానీ, రాకపోతే నేనేమీ చెయ్యలేను. ఆ విషయంలో నిస్సహాయుణ్ణి’’ అన్నాడు.
ఉపనిషత్ వాక్యాలు అలాంటివే. అవి ఋషుల గుండా వచ్చాయి. వాళ్ళు నిమిత్తమాత్రులు. వాటికి ఒక సిద్ధాంతాన్ని అంటగట్టడానికి వాళ్ళెప్పుడూ ప్రయత్నించలేదు. లేని సమగ్రతని తీసుకురావడానికి పూనుకోలేదు. వాటిని యథాతథంగా వ్యక్తీకరించారు. అందుకే వాటిల్లో అంత సహజత్వం, సౌందర్యం వున్నాయి. * 

No comments:

Post a Comment